జపనీస్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ అటు పేటీఎం మాల్, ఇటు గ్రోఫర్స్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. వెరసి ఈ రెండు కంపెనీలలో తాజాగా ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలనూ అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ద్వారా పేటీఎం మాల్లో 20 శాతం వాటాను సాఫ్ట్బ్యాంక్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ ద్వారా గ్రోఫర్స్లో 40 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈకామర్స్ రిటైలర్గా కార్యకలాపాలు సాగిస్తున్న పేటీఎం, ఆన్లైన్ గ్రోసరీస్ విక్రేత అయిన గ్రోఫర్స్ మధ్య డీల్ కుదిరితే రెండు కంపెనీలకూ ప్రయోజనం చేకూరడంతోపాటు.. పెట్టుబడులు వృద్ధి చెందే వీలున్నట్లు సాఫ్ట్బ్యాంక్ ఆశిస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక డీల్కు తెరతీసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్లో అలీబాబాకు 35 శాతం వాటా ఉంది. సైఫ్ పార్టనర్స్, ఈబే, సీఈవో విజయ్ శంకర్ శర్మ సైతం వాటాలను కలిగి ఉన్నారు. కాగా.. మరోపక్క మిల్క్ డెలివరీ స్టార్టప్ మిల్క్ బాస్కట్లో పెట్టుబడికి పేటీఎం మాల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలను సైతం జత చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మిల్క్ బాస్కట్లో కలారీ కేపిటల్, మేఫీల్డ్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.