అంతేకాదు!! అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ప్యాకేజీని ఆడేసుకున్నాయి. ఆర్థిక మంత్రి మాటలన్నీ ఆ 20లక్షల కోట్లను చూపించటానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్యాకేజీ డొల్లేనంటూ విమర్శించాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే పచ్చి మోసం... దగా అంటూ దుయ్యబట్టారు. పడిపోయిన డిమాండ్కు ఊతమిచ్చే ప్రత్యక్ష ఉద్దీపన చర్యలేమీ లేకుండా... చిన్న సంస్థలకు రుణాలంటూ హడావిడి చేస్తే లాభమేంటని పరిశ్రమ తప్పుబట్టింది.
ఇది రుణ మేళా తప్ప ప్యాకేజీ కాదని విపక్షాలు తూర్పారబట్టాయి. కుదేలైన ఆతిథ్య, ఆటోమొబైల్ వంటి రంగాలు తమ ఊసే లేదంటూ మొత్తుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జోకులు వైరల్ అవుతున్నాయి. నిజానికి లాక్డౌన్ ఆరంభం నుంచి ప్రధాని మోదీని కీర్తించిన వారూ... ఈ ప్యాకేజీ చూశాక పెదవి విరవక తప్పటం లేదు.
ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాల ప్రకారం... నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ప్యాకేజీ కోసం ఖర్చు చేసేది రూ.3 లక్షల కోట్లు కూడా ఉండదు. ఇక బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేది రూ, లక్ష కోట్లను మించదు.