► గ్రామ గ్రామానికి గోదావరి జలాలు అందించాలన్నది బీజేపీ లక్ష్యమని, దీనికోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పాటును అందిస్తుందని రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వీర్రాజు మాట్లాడుతూ చెప్పారు.
► రాష్ట్రంలో జనసేన–బీజేపీ కూటమిని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
► ఇచ్చిన మాట మేరకు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారంతో నిధులు తెస్తామన్నారు.
► అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలతో పాటు విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలపై కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు.
వీర్రాజు నాయకత్వం బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహరాల సహ ఇన్చార్జి సునీల్ దియోధర్ పేర్కొన్నారు. పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎమ్మెల్సీ మాధవ్, నేతలు పురందేశ్వరి, సీఎం రమేశ్, హిమాచల్ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్లు వీర్రాజుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయంగా ఎంతో అనుభవం, పుష్కలమైన నాయకత్వపు లక్షణాలు, సేవాతత్పరత కలిగిన వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనతో కలసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.