జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలా వచ్చాయి? మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్ మెరిట్ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్ మెరిట్ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక్కసారిగా.. ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్ లిస్ట్లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్సైట్లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు.