రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1902 నెంబర్ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. 1902కు వచ్చే కాల్స్పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. దీనిపై ఫోకస్గా ముందుకు వెళ్లండి. 14400 నెంబర్పై మరింత ప్రచారం నిర్వహించండి, పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టండి. రెడ్ హ్యండెడ్గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదు. అవినీతికి పాల్పడుతూ, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలి. కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలి. దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలి.