ప్రైవేటురంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ అమెరికాకు చెందిన న్యాయ సంస్థల వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ వ్యాజ్యంతోపాటు, తమ బ్యాంకు ఉద్యోగులపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించింది. వీటిపై తాము న్యాయ పోరాటం చేయనున్నామని స్పష్టం చేసింది. నిజాలను దాచిపెట్టి, తప్పుడు ప్రకటనలతో వాటాదారుల నష్టాలకు కారణమైందన్న ఆరోపణలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. దీనిపై 2021 ప్రారంభంలో తమ స్పందన తెలియజేయాలని భావిస్తున్నట్టు రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి వివరాలను అందించలేమని పేర్కొంది.