మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు. బినామీలు, వారి ఖాతాలపై నజర్ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు.