ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడం, ఇటు కాలేజీలకు యూని వర్సిటీ అఫిలియేషన్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈమేరకు కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలు కాగా, సోమవారం (ఈనెల 12న) నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బీటెక్లో కొత్త కోర్సులకు అనుమతి రాకపోవడంతో పాటు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వారం పాటు వాయిదా వేశారు. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ఇచ్చేకునేలా వెబ్సైట్లో అధికారులు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వరకు ఆప్షన్లు ఇచ్చేలా వీలు కల్పించారు. అదేరోజు ఆప్షన్లు ఫ్రీజ్ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి.