చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదాసీదా ఉద్యోగంతో తృప్తిచెందక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతృప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జీరోధా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండిల్ టెక్నాలజీస్ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది.