తనను దూరం పెట్టినందుకు ఓ మహిళ తన ప్రియుడిపై యాసిడ్ పోసిన ఘటన త్రిపుర రాష్ర్టంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ఆ రాష్ర్ట రాజధాని అగర్తలాకు 50 కిమీ దూరంలో ఉండే ప్రాంతానికి చెందిన బీనా(27), సోమన్(30) పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. పదేళ్ల కిందట వీళ్లు ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2010 నుంచి మహారాష్ర్టలోని పుణెలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో సోమన్ చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బులను బీనా చిన్న చిన్న పనులు చేస్తూ సమకూర్చేది. అనంతరం సోమన్కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తొమ్మిది సంవత్సరాలు పుణెలో బీనాతో కలిసి ఉన్న సోమన్ 2019లో సొంత రాష్ర్టానికి తిరిగొచ్చేశాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి బీనాతో మాట్లాడటం మానేశాడు. సోమన్ కోసం ఆ మహిళ సంవత్సరం నుంచి చాలా ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్ను బీనా గుర్తించారు. అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా సోమన్ నిరాకరించడంతో ఆమె విచక్షణ కోల్పోయారు. తనతో మాట్లాడకుండా దూరం పెడుతున్నాడన్న కోపంతో ఉన్న అతనిపై యాసిడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు బీనాను అరెస్టు చేశారు. యాసిడ్ దాడిలో తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.