మలయాళంలో సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్,రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. జనవరి 25 నుండి చిత్ర షూటింగ్ మొదలు కాగా, రీసెంట్గా పవన్ సెట్స్లో అడుగుపెట్టాడు. ఇక నేటి నుండి రానా కూడా పవన్తో కలిసి షూటింగ్లో పాల్గొననున్నాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పది రోజులపాటు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్, రానాలతో పాటు సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.