నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 135 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో టెస్టును రెండు రోజుల్లో ముంగియగా.. నాలుగోటెస్టు మూడు రోజుల్లో ముగిసింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 205 భారత్ తొలి ఇన్నింగ్స్ : 365 ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 135 ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో స్టోక్స్ మినహా మరెవరు రాణించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ స్కోరును సమం చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే పంత్- సుందర్, సుందర్- అక్షర్ల భాగస్వామ్యం టీమిండియాను మ్యాచ్ మీద పట్టు బిగించేలా చేసింది. పంత్ సూపర్ సెంచరీ.. సుందర్ 96 నాటౌట్.. అక్షర్ పటేల్ 43 పరుగులతో రాణించడంతో టీమిండియా 365 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 160 పరుగుల ఆధిక్యం సంపాదించినట్లయింది.