గతేడాది లాక్డౌన్ కారణంగా ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు జరిగి ఆలస్యంగా సీజన్ ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మ్యాచ్లు జరిగాయి. కరోనా కారణంగా... అది అలా సాగిపోయింది. అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికే షెడ్యూల్ ప్రారంభించాలని బీసీసీఐ భావించి.. పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా ప్రభావం తగ్గింది.. ఇక సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాయనుకుంటున్న తరుణంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో అసలు మ్యాచ్లు జరుగుతాయా అన్న సందేహం కలుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్తో సహా లీగ్తో సంబంధమున్న 20 మందికి కరోనా సోకింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ కూడా కరోనా బారిన పడ్డాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్లో ఒకరు వైరస్ బారినపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు అటు జట్లు, ఇటు అభిమానులు సిద్ధమవుతున్న వేళ ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారినపడటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇటు ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వాంఖడే స్టేడియం గ్రౌండ్ సిబ్బంది కరోనా బారినపడటంతో.. అక్కడి నుంచి మ్యాచ్లు తరలించాలనే ఆలోచనకు బీసీసీఐ వచ్చింది. మరోవైపు మహారాష్ట్రలో లాక్డౌన్ పరిస్థితులు కూడా కనపడటంతో.. స్టాండ్ బైగా హైదరాబాద్, ఇండోర్ స్టేడియంలను ఎంపిక చేసింది. అయితే బయో బబుల్లోనే మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి.. మ్యాచ్లను ఇతర స్టేడియంలకు తరలించే అవకాశం ఉండకపోవచ్చనే బీసీసీఐ భావిస్తోంది. బబుల్లోకి ప్రవేశించే ముందు ఏడు రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఆటగాడు కచ్చితంగా మూడు పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. దీంతో సురక్షితమైన వాతావరణంలోనే మ్యాచ్లు జరుగుతాయని.. ఎలాంటి ఆటంకం ఉండదనే విశ్వాసంతో ఉంది.