భారత్, వెస్టిండీస్(IND vs WI) మధ్య మూడు వన్డేల సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ శుక్రవారం, ఫిబ్రవరి 11న అహ్మదాబాద్ మైదానంలో జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న రోహిత్ & కో.. చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్(Rohit Sharma), ద్రవిడ్ పలు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడో మ్యాచ్లో భారత జట్టు ఏ 11 మంది ఆటగాళ్లతో మైదానంలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం.
ఓపెనింగ్ పెయిర్.. మూడో వన్డే మ్యాచ్లో, టీమిండియా ఓపెనింగ్ జోడిలో మార్పు ఉండవచ్చు. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్తో కలిసి శిఖర్ ధావన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కరోనా కారణంగా ధావన్ మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. అతనికి రెండవ మ్యాచ్లో అవకాశం లభించలేదు. అయితే మూడవ మ్యాచ్లో ధావన్కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఓపెనర్గా విఫలమయ్యాడు. అదే సమయంలో రెండో మ్యాచ్లో పంత్కు బ్యాటింగ్ బాధ్యతలు అప్పగించినా.. భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
మూడొ స్థానంలో.. 3వ స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్ బ్యాటింగ్ చేయనున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో విరాట్ బ్యాట్తో చాలా నిరాశపరిచాడు. తొలి వన్డేలో 8 పరుగులకే ఔట్ కాగా, రెండో మ్యాచ్లో 18 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్ చివరి మ్యాచ్లోనైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వికెట్ కీపర్ స్థానంలోనూ మార్పు.. 4వ ర్యాంక్లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. ఇక వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెండో మ్యాచ్లో రాహుల్ 48 బంతుల్లో 49 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. ఇక సూర్య కుమార్ కూడా క్లిష్ట పరిస్థితుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్లో సూర్యకుమార్ 34 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను ముగించాడు.
వికెట్ కీపర్గా రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ను ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కూడా తొలి మ్యాచ్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో పంత్ మొదటి రెండు మ్యాచ్లలో 14.50 సగటుతో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంత్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నిరంతరం ఆడుతున్నాడు. కాబట్టి అతనికి విశ్రాంతి కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.