ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2022)ను జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.
టెట్ను ప్రతి ఏటా నిర్వహించాలనే నిబంధన ఉన్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. అప్పట్లో డీఎస్సీతోపాటు టెట్ను కూడా నిర్వహించారు. 2018 నుంచి ఇప్పటి వరకు వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేశారు. కాగా ఏపీలో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ ఏడాది టెట్ నిర్వహణ అనంతరం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 6,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35-40 వేల స్కూల్ అసిస్టెంట్లు (School Assistant posts) అవసరం ఉంది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి.. అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎంఈవో-2 పోస్టుల ఏర్పాటు కోసం ఏ ఉపాధ్యాయ పోస్టు రద్దు చేయమని.. ఓ ఒక్క పాఠశాలను మూసేసే ఆలోచన లేదన్నారు. మూడు దశల్లో 30-40 వేల అదనపు తరగతి గదులను నిర్మిస్తామని మీడియకు తెలిపారు.
మరోవైపు పొరుగురాష్ట్రమైన తెలంగాణలో టెట్ నిర్వహణకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 26 నుంచి ప్రారంభమైంది. జూన్ 12న టెట్ పరీక్ష జరగనుంది. అనంతరం ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలవ్వనుంది.