ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలన, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూన్ 14 వరకు ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాశ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. బూత్ కమిటీ నియామకాలు పూర్తి చేయాలని ఈ సమావేశంలో శివప్రకాశ్ సూచించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్న సందర్భంలో ఏర్పాట్లపై కూడా ఈ సమావేశం చర్చించింది. ఐఎస్బీ విద్యార్థుల 20వ గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రధాని హాజరుకానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26వ తేదీన హైదరాబాద్ రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అలాగే రామగుండంలో ఏర్పాటు చేసిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించబోతున్నారు. తెలంగాణకు పార్టీ నేతలతో కీలక సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.