తెలంగాణ రాష్ట్రంలో 17,291 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి తో ముగియనుంది. ఐతే రాత పరీక్షలకు సంబంధించిన తేదీలను నోటిఫికేషన్లతోపాటు ప్రకటించలేదు. పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమ్స్ రాత పరీక్ష ను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) సన్నాహాలు చేస్తోంది. ఇక ఆగస్టు 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకపోతే దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కానున్నాయి. ఒకవేళ ఆ తేదీల్లో టీఎస్పీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఉంటే స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. ముందుగా ఎస్సైల ఎంపిక ప్రక్రియ, ఆ తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. దీనివల్ల ఎస్సైలుగా ఎంపికైన వారిని కానిస్టేబుల్ పోటీ నుంచి తప్పించే వీలుంటుంది. తెలంగాణలో ఈసారి భారీఎత్తున 17,291 పోస్టులను టీఎస్ఎల్పీఆర్బీ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా.. మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులే. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు కలిపి మే 25 వరకు సుమారు 12.1 లక్షల దరఖాస్తులొచ్చాయి.
కానిస్టేబుల్ పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు మే 26న గడువు ముగిసే నాటికి సుమారు 14 లక్షల దరఖాస్తులు రావొచ్చని, వీటిలో కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తులే 9 నుంచి 11 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక రాతపరీక్షలకు సంబంధించి జూన్ 10 నాటికి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాల్టికెట్ల జారీతో పాటు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియను అప్పటిలోగా పూర్తి చేయనున్నారు. 2018 నోటిఫికేషన్లో భాగంగా సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఈసారి అదనంగా రవాణా, ఎక్సైజ్శాఖ సిబ్బంది నియామకాల బాధ్యతనూ ఆయా శాఖలు టీఎస్ఎల్పీఆర్బీకే అప్పగించాయి. వాటిలోనూ కానిస్టేబుల్ పోస్టులే ఉండటంతో మండలి ద్వారా శారీరక సామర్థ్య పరీక్షల నియామకాలు చేపడితే ఫలితాలు పక్కాగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.