గ్రేటర్ వరంగల్ పరిధి మూడో డివిజన్లోని ఆరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద గ్రామసభలో పాల్గొన్న ‘తీన్మార్’ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు శనివారం బలవంతంగా అరెస్టు చేశారు. రింగురోడ్డు నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకంపై జరుగుతున్న రైతు గ్రామసభలో ఆయన ప్రసంగిస్తుండగా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. మల్లన్నను అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, స్థానిక మహిళలు ‘పోలీస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం తీన్మార్ మల్లన్నను బలవంతంగా అరెస్టు చేసి వేలేరు పోలీసు స్టేషన్కు తరలించారు.