మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీని కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్న ఈ మెగా హీరో రెట్టింపు ఉత్సాహంతో కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తేజ్ కెరీర్లో 15వది (SD15) కావడం విశేషం. అయితే, తాజా సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించిన కథా నేపథ్యం గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 'భమ్ బోలేనాథ్' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటుగా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఈ సినిమా మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి, ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఇతివృత్తంతో ఈ కథ..నడుస్తుందని అని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్తోనే డిఫరెంట్ జోనర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న సినిమా అని చిత్రబృందం హింట్ ఇచ్చింది. సుకుమార్ వంటి అగ్ర దర్శకుడు అందిస్తున్న కథతో తేజ్ మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా చేస్తుండటం ఆసక్తికరం అని చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుంచి వినూత్న కథాంశాలను ఎంచుకున్న ఈ మెగా హీరో, ఈసారి థ్రిల్లర్ సబ్జెక్ట్ను ఎంచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు 'రిపబ్లిక్', 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ సాధించిన సంగతి తెలిసిందే.